ప్రభుత్వం, ప్రతిపక్షం - ఏ రాయైతే ఏంటి? 25-06-2019
తొమ్మిది నెలలు ముందుగానే, ముందస్తు ఎన్నికలకెళ్ళడం కె సి ఆర్ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమేఆలోచించుకుని చేసిన పని. ప్రజా ప్రయోజనాల ఊసే ఇందులో రాదు. ప్రజాధనం వృధా అవ్వడం తప్ప. సరే గెలిచారు. బంగారు తెలంగాణ ఆశలు ప్రజల్ని వదల్లేదు. పైగా ప్రతిపక్షాలు ఏ మాత్రమూ బాధ్యతాయుతంగా ప్రవర్తించ లేదు. ప్రజలసమస్యల కోసం పోరాడిన ప్రతిపక్ష నాయకుడు ఒక్కరూ లేరు. ఫోటోలకోసం ఒకరోజు దీక్షలు చెయ్యడం వంటిక్రియాశూన్యమయిన కొద్ది గిమ్మిక్కులు తప్ప వారు పొడిచిందేమీ లేదు. అందుకే ప్రజలు టీ ఆర్ ఎస్ కే మళ్ళీ పట్టం కట్టింది.
అందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి కే సి ఆర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలేంటి? పూర్తి కాని ప్రాజెక్టుకు ప్రా'రంభో'త్సవాలు, యాగాలూ, యజ్ఞాలూ, పార్టీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలూ. అందుకోసం మొత్తం మంత్రివర్గమూ, శాసనసభ్యులూ, మిగతా వందిమాగధ బృందాలూ - వెరశి బొచ్చెడు ఖర్చూ, కాలయాపనా. రాష్ట్ర సచివాలయాన్నేసందర్శించని ముఖ్య మంత్రికి మరో సెక్రటేరియట్ కట్టడం ఆయనకు కనిపించిన ప్రాధాన్యం! ఇందులో కూడామఠాధిపతులవంటి వారి సలహాలే ఉండిఉంటాయి కానీ, ఏమాత్రం ప్రజా ప్రయోజనాలూ ఉండవన్నది జగమెరిగినసత్యం. ఉమ్మడి రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్లమందిని పరిపాలించడానికి/ మభ్యపెట్టడానికి చాలిన ప్రాంగణం ఇప్పుడునాలుగు కోట్లమందికి ఎందుకు సరిపోదు? అభివృధ్ధి అంటే పాలకుల జీతాలూ, సౌకర్యాలూ/ షోకులూ పెరగడమా? దానికిప్రజలపై ఋణభారం పెరగడమా!
ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి చూడండి. ప్రజావేదిక కూలగొట్టడం - ఇప్పటికిప్పుడు వందల కోట్ల నష్టమేమీ వచ్చెయ్యదుకానీ మనం నిశితంగా చూడవలసిన అంశం - సాక్షాత్తూ శాసనకర్తలూ, ప్రభుత్వాలూ శాసనోల్లంఘన ఎలా చేస్తున్నారూఅన్న విషయం నివ్వెరపరిచే ఒక పార్శ్వం అయితే దాన్ని ఆపాల్సింది అప్పట్లో ఎవరు? అన్నది అసలైన పార్శ్వం. ఆబాధ్యత మొట్టమొదటగా ప్రతిపక్షానిది. తరువాత ఆయా స్థానాల్లో ఉన్న అధికారులది.
అయ్యా కొత్త ముఖ్యమంత్రి గారూ! అప్పటి మీ శాసనసభ్యుల బలమెంత? ప్రజలు మీకు ఇచ్చిన ఓట్లెన్ని? కేవలంఒకటిన్నర శాతం మాత్రమే అధికార పార్టీ కంటే తక్కువొచ్చాయి మీకు ఓట్లు. ప్రజలు మీమీద అంత విశ్వాసం పెడితే, వారిసొమ్మును కాపాడాల్సిన మీరు బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాక, తదుపరి పర్యాయం అధికారంలోకి రావడానికి మాత్రమే కృషి చేసుకున్నారు తప్ప, ప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటి అవకతవకల్ని నిలదీయలేదు. అరవయ్యేడు మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్న ప్రజల పట్ల ఎంత కార్యశూన్యత్వం చూపారు! అప్పటి ముఖ్యమంత్రి పై ఉండే దుగ్ధ కొద్దీ, వ్యక్తిగతఉడుకుమోత్తనం కొద్దీ శాసనసభకే దూరంగా ఉన్నారు కదా అది భావ్యమేనా? ఆదిలోనే తుంచేసి ఉంటే, లేదాన్యాయపోరాటం చేసుంటే ఇప్పుడు ఇంత విధ్వంసం అవసరమయ్యేదా! ప్రజాధనం విచక్షణ లేకుండా తగలెట్టడంలోదొందూ దొందే అయ్యారు కదా! మళ్ళీ వారో, మరొకరో అధికారంలోకి వస్తే, మీరు కట్టినవన్నీ ఎదో ఒక వంకబెట్టి కూలగొట్టరన్ననమ్మకం ఏవుంది? చట్టాలలో లొసుగులుండబట్టే కదా ఈ అవ్యవస్థ అంతా! చట్టాలలో లోపాలున్నట్టే కట్టడాలలోనూ ఏవోఅతిక్రమణలుండడం అతి సహజమయిన విషయాలు కదా మన దేశంలో! మరి మరొకరు లోటస్ పాండు, ఇడుపులపాయవంకా చూడకుండా ఉంటారా? సరే అవి మీ సొంత వ్యవహారాలు అనుకోండి. ఎలా చక్కబెట్టుకోవాలో మీకు రాజకీయాలతోపెట్టిన విద్య. మరి ఈ ప్రభుత్వ భవనాల మాటేంటి? అది స్వయంగా ప్రజల సొమ్ము కదా!
మీ తండ్రిగారి హయాం లోనేకదా, ఎల్ ఆర్ ఎస్, బి ఆర్ ఎస్ వంటి వెసులుబాట్లిచ్చి పరిమితులు లేని లేఅవుట్లకూ, నిర్మాణాల అతిక్రమణలకూ కొంత అపరాధ రుసుం వసూలు చేసి క్రబధ్ధీకరించేరే! ప్రజావేదిక విషయంలో అలాంటివెసులుబాట్లు ఏవీ దొరకలేదా? అయినా శిక్షించాల్సింది అతిక్రమణకు పాల్పడినవారిని గానీ - - ప్రజల్నీ, ప్రజా వనరుల్నీనా?
అందరూ ఇలాగే చేస్తే ప్రజలకింక మిగిలిన దార్లేముంటాయి? మధ్యస్తంగా వచ్చే కుల పార్టీలూ, గ్లామర్ పార్టీలూఏమాత్రం ఆశాజనకం కాదు. అందుకే వాటినీ తిరస్కరించారు కదా! ఎర్ర జెండా ఎప్పటినుండో వెలిసిపోతూ వస్తోంది. కాషాయం మరో రకం ఎరుపును సంతరించుకుంటోంది. ఇంకేవిటి కింకర్తవ్యం???
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి