తెలుగు సంగతులు

సోమవారం, ఆగస్టు 10, 2020


'ఇంట్లో ప్రేమచంద్'

బెంగాలీ కధల్నీ, నవలల్నీ, సినిమాలుగా తీసిన ప్రముఖుల రచనల్నీ అరవై ఏళ్లక్రితం ప్రజ్ఞాశాలి సమీక్ష చేస్తూ --" ఏవుందీ! కుండెడు కుంకుమా, బండెడు పాదధూళీ నూ"అని ఒక్క ముక్కలో కొట్టిపారేశాడు. అంత నిర్దాక్షిణ్యంగా మెచ్చుకోలు తీర్పు ఇవ్వగలిగేది ఇంకెవరు? మన ముళ్ళపూడివారే. ఆయనే ఇంకోసారి గురుదత్ ' ప్యాసా ' సినిమాను సమీక్షిస్తూ అలాగ పార్కులమ్మటా పొడుగ్గా సిగరెట్లు నిట్టురుస్తూ పాటలు పాడుకోపోతే సుబ్బరంగా కధానాయికతో ముఖాముఖీ కూర్చొని ఇదీ సంగతి అని చెప్పుకోవాలికదా? అని తేల్చేశేడాయన, పెద్దంతరం చిన్నంతరం పట్టించుకోకుండా. ! కతల్ని కమామీషుల్నీ సమీక్షించడానికి పెద్దంతరమేవిటీ? అందులోనూ ముళ్ళపూడి వారికి.

ఇంతకీ ఇప్పుడు సంగతంతా ఎందుకూ అంటారా. వస్తున్నా అక్కడికే! సరే మధ్య మధ్యలో నుదుట సింధూరం, పాదధూళీ మనక్కూడా బానే ఉంటాయి కదా అని ఆశతో బెంగాలీ కధలూ, నవలలూ చదవాలనే చాపల్యంతో తిరగేస్తుంటాం కదా, కాస్త వెరైటీ కోసం. అదో అలవాటు.బలహీనతా. పైగా అనువాదం చేసింది చెయ్యి తిరిగిన శాంతా సుందరి గారో అయితే మరీ మనసు లాగుతుంది కదా. మధ్యన వరసబెట్టి ఆవిడ అనువాదాలు చదివేసిన ఊపులో వెతికి మరీ బంగాలీ ప్రసిధ్ధ రచయిత గురించి ఇంటావిడ రాసిన పుస్తకం గుక్కపెట్టి మరీ చదివేశాను. అయిపోయింది. ఇంతకీ ప్రముఖ రచయిత, సామ్యవాది, మానవతావాది కీ.శే. ప్రేంచంద్. ఆయన గురించి ఆయన భార్య 'శివరాణీదేవి 'రచించిన  పుస్తకం పేరు 'ఇంట్లో ప్రేమచంద్ ‘.



పుస్తకం పూర్తయ్యేసరికి, ఏంటబ్బా ఇంతకీ ఇందులో  ఏవిటి సంగతీ అనిపించింది. ముళ్ళపూడి వారి మాటలు బెంగాలీ రచనల గురించినవి గుర్తొచ్చాయి. ఎటొచ్చీ 'వంటెడు జబ్బులూ, ఇంటెడు విరేచనాలూ లెక్క తేలాయి కధనంలో.

ఎవరి జీవిత చరిత్ర అయినా, ఆత్మ కధ అయినా సొంత ఘోష, గోడు లేదా స్వోత్కర్షగా ఉండవు సాధారణంగా. ఎక్కువమంది మహానుభావులవి చరిత్రను నమోదు చేసేవిగా ఉంటాయి. వారి ఆదర్శప్రాయమైన జీవితాల్లోని లోపలి కోణాల్నీ, వారి రోజువారీ అలవాట్లలోని క్రమతనూ, వీధిలోకీ ఇంట్లోకీ వారి ఆలోచనలకూ, అలవాట్లకూ ఉండే సామీప్యతను, తేడాలనూ కూడా ఎత్తి చూపిస్తాయి. ఎక్కువ భాగం ఆయా పెద్దల ఆత్మకధలు ఎంతో నిజాయితీతో నిండి మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు చెబుటాయిగాంధీ గారి సత్యశోధన గానీ శ్రీశ్రీ అనంతం గానీ అలాంటి కుండబద్దలు విషయాలు మనకు ఆహా, అందుకు కదా వాళ్ళు మహాత్ములయ్యారు అనిపించేలా ఉంటాయి

నా మట్టుకు నాకు కొన్ని జీవితచరిత్రలూ, ఆత్మ కధలూ నిరాశనూ నిస్పృహనూ కలిగించాయిప్రభావవంతమయిన సంగతులు దొరకవు సరికదా, అనవసర ప్రసంగాలూ, తెలుసుకోనక్కరలేని విషయాలూ ఉంటాయి. నాకు అలాంటి భావన మాక్సిం గోర్కీ నా బాల్యం, నా బాల్యసేవ చదివినప్పుడు కూడా కలిగింది. ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావాన్ని చూపించినవే అయినా కానీ సొంత కధ వచ్చేటప్పటికి ఏవిటో వాళ్ళ అమ్మమ్మా, ఆవిడ చర్చి నమ్మకాలూ.. నాకుపకరించని విషయాలు కదా అనిపించిందిఅయ్యో అనవసరంగా కాలయాపన చేసేశాను కదా! మరో మంచి చరిత్ర పుస్తకమో లేదా ఆహ్లాదపరిచే హాస్య పుస్తకమో చదివితే బాగుణ్ణు కదా అనిపిస్తుంటుందికొన్ని కఠోర జీవితసత్యాల్ని వేదాంత ధోరణిలో కాకుండా మనసుని తాకి మనల్ని ఘర్షణకీ, రాపిడికీ గురి చేసే కొన్ని పుస్తకాలు మళ్ళీ చదివి ఉంటే బాగుండుకదా సమయంలో అనిపిస్తుంది. అలా అనిపించిన సందర్భం ఇప్పుడు ఇంట్లో ప్రేంచంద్  పుస్తకం చదివినప్పుడు.
  
అప్పటి చారిత్రక విశేషాలు కొన్ని ఇందులో నమోదు అవడం సంతోషకరమే, కానీ అవి బహు స్వల్పం. మనలో చాలామంది  చేసుకునే రోజువారీ వాదనలుసంగతులే ఎక్కువ దొర్లాయి. వాదనల్లో ఎప్పుడూ శివరాణి గారు ప్రేంచంద్ ను రాత్రుళ్ళు రాసుకోవద్దంటూ ఘర్షణ పడడం సందర్భంలో ఆయన పెన్ను విరిచెయ్యడం, కాగితాలు లాక్కోవడం వగైరా స్పర్ధలే. ఆటుపోట్లు ప్రతి రచయితా కళాకరుడూ, కళాకారిణీ ఎదుర్కొనేవే. సంఘర్షణలు రచనా వ్యాసంగానికే ఆటంకమయినప్పుడూ అవి అధిగమించే క్రమం మరీ గొప్పదయితే తప్ప జీవిత చరిత్రల్లో, స్వీయరచనల్లో చోటు చేసుకోనక్కరలేదు

కొన్ని మాత్రం అప్పటి అలవాట్లనీ, సంప్రదాయాల్నీ, దుస్సంప్రదాయాల్ని విప్పి చెప్పడంతో కొద్దిమట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికీ మనల్ని నిస్పృహపరిచే విషయాలు అప్పుడూ అదే విధంగా ఉండడం గమనిస్తాము. యువకుల తొందరపాటూ, నిర్లక్ష్య ధోరణులూ ఎదిగిన సంతానం తల్లిదండ్రుల పట్ల బాధ్యతారహితులుగా ఉండడమూ కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దలు అనుకున్నట్టే సరిగ్గా అలాగే  వందేళ్ళనాడు అప్పటి పెద్దలు తమ పిల్లల పట్లా, యువతరం గురించీ అనుకోవడం మనకు కొత్త అలోచననల్ని రేకెత్తిస్తాయి.

ప్రత్యేకించి విశేషం ఏంటంటే, ఇప్పుడు చదివితే సరిగ్గా తొంభై నుండి వంద సంవత్సరాల వెనుక ఒక ప్రసిధ్ధ రచయిత ఇంటిలోని ఘోష వినబడుతుంది. అంత అవసరమా అనిపించింది. ప్రఖ్యాత రచయిత రచనల్లో ఏదో ఒకటి 'గోదాన్ 'లాంటి పుస్తకం చేతిలోకి తీసుకుంటే మేలు కదా అనిపిస్తుంది. లేకపోతే శ్రీపాద వారిదో, ఆచంట జానకిరాం గారిదో స్వీయ చరిత్ర మరోసారి చదువుకుంటే పోలా!

ఇంతట్లోనూ చెప్పుకోదగ్గ విషయంశ్రీమతి ఆర్. శాంతాసుందరి గారి అనువాద ప్రతిభ గురించి చెప్పుకోకుండా సమీక్షా వ్యాసాన్ని ముగించడం కుదరని పని. కానీ ఆవిడ డెభ్భయ్యొ పడిలో ఉండగా ఇంతటి కృషిని మరో పుస్తకం 'సేపియన్స్ 'లాంటి దానిపై పెడితే బావుణ్ణు కదా అనిపించింది నాకైతే.
షరా మామూలుగా అక్షర దోషాలు బాగా దొర్లాయి.


'ఇంట్లో ప్రేంచంద్', రచన ; శివరాణీదేవి ప్రేంచంద్. అనువాదం : ఆర్. శాంతాసుందరి. పేజీలు : 274.ప్రచురణ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్. 2012.

శనివారం, జులై 18, 2020

'అసురుడు' పుస్తక సమీక్ష



 'అసురుడుపుస్తక సమీక్ష

      రాముడు దేవుడు. రావణుడు రాక్షసుడు. వీరిద్దరి వైరానికి కారణం సీత. రాముడు రావణున్ని వధించి సీతను తిరిగి తెచ్చుకుంటాడు. ఇదీ క్లుప్తంగా రామాయణం. రామాయణం అంతా ఇప్పుడెందుకూ అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ఎందుకంటే రామాయణం యుగయుగాలుగా వింటున్న పవిత్రమైన కధ. వాల్మీకిది కాకుండా ఎన్ని రామాయణాలు, వాటిపై ఎన్ని వ్యాఖ్యానాలూ, విమర్శలూ వచ్చినా మనకంతా అది ఒక వైపు నుండి విన్నదే. విశేషాలన్నీ అయోధ్య నుంచి మొదలై, మిధిలా నగరం, వింధ్యారణ్యం, కిష్కింధ మీదుగా వెళ్ళి లంకకు చేరి తిరిగి అయోధ్యకు చేరడంగా మనకు తెలుసు. అదే విన్నాం. దశరధునికి ముగ్గురు భార్యలూ, అయినా సంతానలేమి, చివరకు కలిగిన నలుగురు సంతానం ఇత్యాదిగా మనకు కధ సాగుతుంది. అప్పటికే పుట్టి పెరుగుతున్న రావణుని విషయాలు కధలో మనకు స్ఫురించవు. అతని బాల్యం, అతని పూర్వులూ, బలిచక్రవర్తి నుండి అతను పొందిన స్ఫూర్తీ, శ్రమించి ఏర్పరుచుకున్న లంక సామ్రాజ్యం వగైరా అంతగా కనబడదు. చర్చకు రాదు. శూర్పణఖ వృత్తాంతం, సీతాపహరణం నుండే రావణుని ప్రసక్తి రావడం, అతనిలోని రాక్షస ప్రవృత్తి మాత్రమే  మనకు కనబడతాయి.

అదే 'రావణాయనం' రాస్తే ఆవలివైపు విశేషాలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. కధనంలో సీతాపహరణం నుండే రాముడు చదువరులకు పరిచయం అవుతాడు. అలాంటి రీతిలో, మరోకోణం నుండి రాసిందే రావణాయనంగా నేను ప్రస్తావిస్తున్న ' అసురుడునవలరచయిత ఆనంద్ నీలకంఠన్. తెలుగు అనువాదం ఆర్. శాంతా సుందరి. అలా చెప్పక పోతే ఇది అనువాదమనే విషయమే మనం గుర్తించం. అంత చక్కగా, సరళంగా ఉంది ఆవిడ అనువాదం. అది ఆవిడ ప్రతిభ

కధ విషయానికొస్తే రామాయణమే ఆవైపు నుండి అనుకోవచ్చు కానీ, అంత తేలిగ్గా నిర్వచించేసుకోడం కుదరని లోతు ఉంది నీలకంఠన్ రచనలో. 'అసురుడు 'కధా రీతి ప్రారంభం నుండే గొప్ప ఎత్తుగడతో మొదలయింది. దీన్ని ఆసాంతం రావణుడూ, అతనితోబాటూ  భద్రుడు అనే సామాన్యుడూచెరి సగంగా చెప్పుకు పోతుంటారు. దానివల్ల జరిగిన గొప్ప ప్రయోజనం ఏంటంటే, అది పురాణ కధే అయినా, ఎప్పుడూ మనం వినే పాలకవర్గం పక్షంగా  కాకుండా జనం వైపు నుండీ భద్రుడి చేత కధ చెప్పించిన తీరు వల్ల నిజాన్ని దగ్గరగా చూడగలిగిన భావన.   దేశ చరిత్రైనా  పాలకుల చరిత్రగానే లిఖితం అవ్వడం మనం చూస్తున్న నిష్ఠుర సత్యం. కానీ జనం వైపు నుండి చెప్పిన అతికొద్ది (నాకు తెలిసి) చరిత్రల్లో, హోవార్డు జిన్ రాసిన ' అమెరికా ప్రజల చరిత్ర 'ఒకటైతే, పురాణ ఇతివృత్తాల్లో పాలితులవైపు నుండి నీలకంఠన్ అసురుడి కధ మరోటి.
  
పక్క రావణుడు చెప్పే కధనంలో పాలకులకు సహజంగా ఉండే సామ్రాజ్య కాంక్షా, అహంభవమూ, గర్వాతిశయమూ, సామాన్యుల పట్ల ఉండే చిన్న చూపూ దృశ్యమానమవుతుంటే, మరోపక్క భద్రుని కధనంలో సామాన్యుడి వేదనా, నిస్సహాయతా, ప్రభువులకు తలవొంచే బానిసతత్వమూ గోచరిస్తూంటుంది. మూడో కోణంలో అదే కూలీ నాలీ జనానికి ఉండే కొంత కపటత్వమూ, కక్కుర్తి బుధ్ధులూ, చోర గుణమూ, వ్యసనపరత్వమూ కళ్ళకు కట్టిస్తాడు కవి. ప్రభువైనా, సామాన్యుడైనా సహజంగా ఉండే మానవ బలహీనతలకూ, స్వార్ధపరత్వానికీ అతీతులు కారని ఎక్కడికక్కడ వివరణ ఇస్తాడు రచయిత.  

రచన మరో ముఖ్యమయిన ఉద్దేశ్యంగా కనబడే విషయం, కుయుక్తుల కూటమి అయిన బ్రాహ్మణ గుంపుల కుతంత్రాలూ, శ్రమదోపిడీ ధ్యేయంగా కుల వ్యవస్థ నిర్మాణమూ, వాటిని అమలుపరచడానికి ఇటు రావణున్నీ, అటు రాముణ్ణీ ఒకే రకంగా మభ్యపెట్టగలిగే వారి జిత్తులూ కధ పొడుగూతా చెబుతూనే ఉంటాడు. ఒడుపు తెలిసిన రచయిత ప్రతిభ, కధను మొత్తం రావణుడు, భద్రుడు ప్రత్యక్ష సాక్షులుగా  నడిపించడంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకు ఆయన ఎంచుకున్న దారి మహ ఉత్కంఠగా ఉంటుంది. రావణుడి యవ్వన దశనుండీ వెంటాడే పాత్ర భద్రుణ్ణి ఒక చాకలి కులస్థుడుగా చిత్రించడంలో ఔచిత్యం మనకు చివరిలో అతడు అయోధ్య చేరి సీత అడవులపాలు కావడానికి అతనే కారణభూతుడవటం వల్ల అర్ధమవుతుంది.

ఇక కధనంలో ఉన్న బిగి కేవలం వర్ణనలే కాకుండా ముఖ్య పాత్రల భావోద్వేగాల్ని సృజించిన తీరు ఆకట్టుకునేదిగా ఉంటుంది. ప్రతీ యుధ్ధఘట్టంలోనూ తెగిపడే తలలూ, మొండేలూ, ప్రవహించే రక్తంతోబాటూ సైనికుల చెమట, బాధా, వేదనా కలగలిసి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తనంతతాను హాయిగా బ్రతికే అడివిమనిషికి పాలకుల రూపంలో, స్వజాతి ప్రేమనూ, పరజాతి ద్వేషాన్నీ మనసుల్లో పాదుగొల్పి, రెచ్చగొట్టి తమ రాజ్య విస్తరణ చేసుకునే దిశలో మట్టి మనిషి తన ఉనికినీ, స్వేచ్చనూ ఎలా కోల్పోతాడో అడుగడుగునా స్పష్టం చేసే కధన రీతి అసలు మర్మాల్ని మన ముందుంచుతుంది.
  
రామాయణం వంటి ప్రతి పురాణ కధలలోనూ సాధారణంగా కనబడే అతిశయోక్తులూ, అతీతశక్తులూ, ప్రకృతివిరుధ్ధమయిన సంఘటనలూ ' అసురుడు ' కధనంలో చాలావరకూ లేకుండాచూసి, కొంత వాస్తవికతతో చిత్రించడం జరిగింది. పుష్పక విమానానికి కూడా సాంకేతికత జోడించి కధను నమ్మశక్యం చెయ్యడం రచయితకున్న చాకచక్యం.

మొత్తంగా నవల తప్పక చదవాలనిపించే రచన. పుస్తకం ముద్రణ ఆకర్షణీయంగా, అతి తక్కువ అచ్చు తప్పులతో, నాణ్యమయిన తేలికయిన కాగితంతో చక్కగా ప్రచురించబడింది. నాలుగు వందల అరవై పేజీలున్నా పట్టుకుని చదవడానికి బరువనిపించని మంచి కాగితం వాడడం సౌకర్యంగా ఉంది. మరోసారి చెప్పుకోవల్సిన సంగతి అనువాదం గురించి. శ్రీమతి ఆర్. శాంతా సుందరిగారి అనువాద కౌశలం అద్భుతం. పరభాష నుండి దిగుమతి అయిన రచనగా ఒక్క దగ్గర కూడా అనిపించదు.

     ఇంత మంచి పుస్తకం వెల రోజుల ఇతర  పుస్తకాల ధరలతో బేరీజు వేస్తే చౌకనే. రెండువందల యాభై రూపాయలుఅన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్దా లభ్యం